Toppers Voice


జేఈఈ

కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా

* ముప్పిరాల విశ్వ విరించి (345 మార్కులు)

345 మార్కులతో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌ శ్రీచైతన్య నారాయణ అకాడమీ(చైనా బ్యాచ్‌)లో ఇంటర్‌ చదివా. రెండో సంవత్సరంలో 511 మార్కులొచ్చాయి. ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సంపాదించాను. అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో కూడా ఉత్తమ ర్యాంకు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా. ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నది లక్ష్యం. ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు ఈసీఐఎల్‌లోని కేకేఆర్‌ గౌతమ్‌లో చదివా. తొమ్మిది చదవకుండా 10వ తరగతిలోకి వెళ్లా. వయస్సు సరిపోకపోతే మినహాయింపు పొందా. నాన్న నరేంద్ర మహీంద్ర సత్యంలో ఉద్యోగం చేస్తున్నారు.

ఏరోనాటికల్‌ ఇంజినీరవుతా

* ఓవిస్‌ ఖాన్‌ (341)

మాది హైదరాబాద్‌లోని టోలిచౌకీ. ఎనిమిదో తరగతి వరకు సౌదీఅరేబియాలోని రియాద్‌లో చదువుకున్నా. ఆ తర్వాత ఇక్కడకు వచ్చి సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివా. నాన్న సౌదీఅరేబియాలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఎంసెట్‌ కూడా రాస్తున్నా. ఐఐటీలో ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతా. శ్రీచైతన్య నారాయణలో ఇంటర్‌ చదివా. రెండు సంవత్సరాల్లో 973 మార్కులు సాధించా.

ఐఏఎస్‌ నా లక్ష్యం

* రవిజగన్నాథ్‌ విశాల్‌ (340)

స్వస్థలం చెన్నై. నా విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫిట్జీ బోధన సిబ్బంది సహకారం ఎంతో ఉంది. నాన్న రవి బాలసుబ్రహ్మణ్యం విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ప్రాజెక్టుల విభాగంలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్‌ నా లక్ష్యం.

ఐఐటీలో చదువుతా

* లీనా మాధురి, (331)

ఇంటర్‌ వరకు సొంతూరు తిరుపతిలో చదివా. శ్రీచైతన్యలో ఇంటర్‌ పూర్తిచేసి చైతన్య నారాయణ బ్యాచ్‌లో చేరా. ఐఐటీలో లక్ష్యంగా సిద్ధమవుతున్నా. అడ్వాన్స్‌డ్‌లో వందలోపు ర్యాంకు సాధిస్తానన్న నమ్మకం ఉంది. నాన్న తిరుపతిలోని ల్యాంకో కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 521 మార్కులొచ్చాయి.

50 లోపు ర్యాంకు లక్ష్యం

* మీసాల వెంకట కళ్యాణ్‌ (326)

ఇంటర్‌ను విజయవాడలో చైతన్యనారాయణ బ్యాచ్‌లో చదివా. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 515 మార్కులు సాధించా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తప్పకుండా 50 లోపు ర్యాంకు తెచ్చుకుంటా. నాన్న కాకినాడలో రిలయన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా మంగళాపురం.

కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా

* పవన్‌ ఆర్‌ హెబ్బర్‌ (322)

స్వస్థలం కర్ణాకటలోని కార్వార్‌. పదో తరగతి వరకు అక్కడే చదివా. ఇంటర్‌ను హైదరాబాద్‌లో చైతన్య నారాయణ బ్యాచ్‌లో పూర్తిచేశా. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 511 మార్కులు పొందా. అడ్వాన్స్‌డ్‌లో 200 లోపు ర్యాంకు వస్తుందని నమ్మకముంది. ఐఐటీలో చేరతా. నాన్న కైగాలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో చేస్తున్నారు.

ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతా

* అభయ్‌ రాజేంద్ర ఢాగా, (324)

మా సొంతూరు మహారాష్ట్రలోని వర్ద. తల్లిదండ్రులు వైద్యులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ చదువు బాగుంటుందని హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేశా. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 509 మార్కులు దక్కించుకున్నా. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతా.

ఈఈఈ చదువుతా

* తోటా వెంకటసాయి ధీరజ్‌, (323)

బొంబాయి ఐఐటీలో ఈఈఈ చదువుతా. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 100 లోపు ర్యాంకు సాధిస్తా. అదే లక్ష్యంగా సిద్ధమవుతున్నా. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 522 మార్కులొచ్చాయి. మేం హైదరాబాద్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలో ఉంటాం. నాన్న మధు.. బొల్లారం పారిశ్రామికవాడలో విద్యుత్తు పరికరాలు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నారు.

100లోపు ర్యాంకు వస్తుంది

* పృథ్వీరాజ్‌ కొలన్‌ (323)

మెయిన్‌లో సాధించిన మార్కులతో 25 లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నా. అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకు సాధిస్తా. ఇంటర్‌ను విజయవాడ సమీపంలోని గూడవల్లిలో చైతన్య నారాయణ బ్యాచ్‌లో చదివా. ఇంటర్‌ రెండో సంవత్సరంలో 518 మార్కులొచ్చాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఉంటున్నాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. కొత్త పరీక్ష విధానం వల్ల అయోమయం ఏమీ లేవు. గతంలో ఏఐఈఈఈ ఉండేది. ఇప్పుడు జేఈఈ మెయిన్‌ ఉంది. అంతే తేడా.

ఈసీఈ నా లక్ష్యం

* సూర్యతేజ (326)

హైదరాబాద్‌లో నారాయణ కళాశాలలో చదివా. ఇంటర్‌లో 972 మార్కులు సాధించా. నా విజయం వెనుక అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఈసీఈ చేయాలనేది నా లక్ష్యం.

ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆలిండియా టాప‌ర్ సందీప్ ప‌త్రి
ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో అఖిలభారత స్థాయిలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్ ప్రతి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఢిల్లీలోని శ్రీ చైత‌న్య బ్రాంచీలో లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ తీసుకున్నాన‌ని అక్కడి శిక్షణా విధానం డిఫ‌రెంట్‌గా ఉంద‌ని తెలిపాడు. కోచింగ్ పూర్తయ్యే సమ‌యానికి క‌చ్చితంగా ర్యాంక్ కొడ‌తాన‌నే న‌మ్మకం క‌లిగింద‌ని తెలియ‌జేశాడు. త‌ల్లి, దండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచ‌న‌లు, స‌బ్జెక్టుల రివిజ‌న్ త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని తెలిపాడు.
2011లో ఐఐటీ - జేఈఈలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన పృధ్వీతేజ్‌ను త‌న విజ‌యానికి ఇన్‌స్పిరేష‌న్ అని అత‌ని లాగే జాతీయ స్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించాల‌నే ల‌క్ష్యంతో చ‌దివాన‌ని చెప్పాడు. సందీప్ ఐఐటీ-జేఈఈ - 2012లో ఆలిండియా 1021వ ర్యాంకు సాధించాడు. ఇప్పుడు ఏఐఈఈఈలో బి.టెక్ ఆలిండియా ఓపెన్ విభాగంలో ఫ‌స్ట్ ర్యాంకు సాధించాడు.
TOP
సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి!
* ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్'
'ఏ పోటీ పరీక్షలోనైనా, వార్షిక పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించాలంటే సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలని' ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' అన్నారు. ఇటీవల ప్రకటించిన ఏఐఈఈఈలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు అందుకున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే'తో తన విజయ విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాలు...
ప్ర.. సక్సెస్‌కు ప్రధాన కారణం ఏమిటి?
జ. అనుభవజ్ఞులైన టీచర్లు చెప్పిన పాఠాలు, వారిచ్చిన గైడెన్స్, ఫ్రెండ్స్‌తో చర్చించడం. ఇవి ఒకవైపు అయితే, మరో ప్రధాన కారణం సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవడానికి కృషి చేయడం. బేసిక్స్‌పై ఎంత అవగాహన ఉంటే పరీక్షల్లో అంత ఎక్కువగా మార్కులు వస్తాయి.
ప్ర.. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జ. ప్రస్తుతం మేం శ్రీకాకుళంలోని న్యూ కాలనీలో ఉంటున్నాం.. మా నాన్నగారు కాసుల బాబు రణస్థలంలోని గవర్నమెంట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తున్నారు. అమ్మగారు వెంకటలక్ష్మి గృహిణి. అక్కయ్య జీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తోంది.
ప్ర.. మీ విద్యార్హతలు..
జ. శ్రీకాకుళంలోని భాష్యం స్కూల్‌లో నేను పదో తరగతి చదివాను. 572 మార్కులు వచ్చాయి. ఇక ఇంటర్ కూడా గుంటూరులోని భాష్యం సంస్థలకు చెందిన కాలేజీలోనే చదివాను. 968 మార్కులు వచ్చాయి.
ప్ర.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు రావడంలో మీ కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారం ఎలా ఉంది? ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించారు?
జ. తలిదండ్రులు నిరంతరం నా వెన్నంట ఉండి ప్రోత్సహించారు. కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ వస్తున్నా నిరుత్సాహ పడవద్దని, వచ్చే పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇక మిత్రులతో ఎప్పుడూ సబ్జెక్టుల గురించి చర్చించే వాడిని. దాంతో వారు కూడా కొత్తకొత్త ఆలోచనలను నా ముందుంచే వారు. నిరుత్సాహపరిచిన వారు చాలా తక్కువ.
ప్ర.. ఏఐఈఈఈ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారా? ప్రిపరేషన్ ఎలా సాగింది?
జ. ఇంటర్ చేరినప్పటి నుంచే ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌తదితర పరీక్షలకు కాలేజీలోనే శిక్షణ ఇచ్చేవారు. లెక్చరర్లు రోజుకు నాలుగున్నర గంటలు పాఠాలు చెప్పేవారు. ఆ సమయంలో నేను ముఖ్యమైన పాయింట్లపై విడిగా నోట్స్ రాసుకునే వాడిని. ఒక్కో సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై బాగా దృష్టి పెట్టే వాడిని. క్లాసులు పూర్తయిన తర్వాత మళ్లీ దాదాపు మూడు గంటలు చదివే వాడిని. ప్రతి రోజూ ఏం చదువుతున్నాం; ఎంత వచ్చింది? ఇంకా ఎంత చదవాలి? వంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించే వాడిని. తద్వారా ఏం చేయాలో తెలిసేది. అంతేకాదు మిత్రులతో కూడా చర్చించే వాడిని. దీనివల్ల మా ఆలోచనా పరిధి బాగా పెరిగింది. ఐఐటీ ప్రిపరేషన్ సమయంలోనే ఏఐఈఈఈ గురించి కూడా చర్చించి దీనికి కూడా ప్రిపేర్ అయ్యాను.
ప్ర.. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
జ. ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండేందుకు టెన్షన్‌కు లోనుకాలేదు. చదివేటప్పుడు వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మొదట ఆలోచించే వాడిని. తర్వాత ఫ్రెండ్స్‌తో చర్చించే వాడిని. అప్పటికి కూడా నివృత్తి కాకపోతే లెక్చరర్లను సంప్రదించే వాడిని.
ప్ర.. పరీక్షలు ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి కదా? తెలుగు మీడియం విద్యార్థులు ఎలా చదవాలి?
జ. మీడియం ఏదైనా ముందు సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై లోతైన అవగాహన ముఖ్యం. సహజంగా ఇంటర్‌లో అందరూ ఇంగ్లిష్ మీడియం పుస్తకాలపైనే ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి ఇంటర్‌నుంచే ఇంగ్లిష్ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తే బాగుంటుంది. నా వరకు నేను టెన్త్, ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో చదివాను కాబట్టి, లాంగ్వేజ్ గురించి అంతగా భయం కలగలేదు.
ప్ర.. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ. ఐఐటీ ముంబయిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలుపెడతాను.
ప్ర.. కొత్త వారికి మీరిచ్చే సలహా.
జ. పరీక్ష ఏదైనా కావచ్చు. హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. సబ్జెక్టుపై అవగాహనకు మొదట ఆలోచించాలి. తర్వాత మిత్రులతో చర్చించాలి. తర్వాత లెక్చరర్లను సంప్రదించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడకూడదు. కూల్‌గా ఉండాలి. చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఎన్ని గంటలు చదివామని కాకుండా చదివనంత వరకు ఆసక్తితో చదవాలి. క్లాసులో చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడతోపాటు టైమ్ మేనేజ్‌మెంట్ కోసం మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. కాలేజీలో ఈ విధానాన్ని అమలు చేస్తుంటే ప్రిపరేషన్ సమయంలో ఏ పాయింట్ల దగ్గర ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి వాటిని లెక్చరర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి. సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించడంలోనే సగం విజయం ఆధాపడి ఉంటుంది. కాబట్టి కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి ఎలాంటి లక్ష్యం నిర్దేశించుకున్నారో దానికి తగిన విధంగా నడుచుకోవాలి. చదవాలి. తద్వారా విజయం సొంతమవుతుంది.
TOP