అవినీతి, అంతఃకలహాలు, నిష్క్రియాపరత్వం- ఈ మూడింటికి ఆలవాలంగా మారిన ఏ రాజకీయ పక్షానికైనా ఎన్నికల్లో ఘోరపరాజయం తథ్యం. వీటిలో ఏదో ఒక్క దుర్లక్షణమే కలిగి ఉంటే, ఆ పార్టీని ప్రజలు క్షమించి వదిలిపెట్టవచ్చు. మూడింటినీ పుణికిపుచ్చుకొన్న ప్రభుత్వాన్ని మాత్రం వారు క్షమించరు. కర్ణాటకలో ఇప్పుడు జరిగింది అదే. అవినీతి, అంతఃకలహాల కారణంగా అక్కడ భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పూర్తిగా నిష్క్రియాపరత్వంలోకి జారుకొంది. దాంతో ఆ సర్కారును ఇక సాగనంపాల్సిందేనన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను మిగతా ప్రతిపక్షాలకన్నా చక్కగా వినియోగించుకొన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర శాసనసభలో స్పష్టమైన మెజారిటీ సాధించగలిగింది.