కళాశాలలు, శిక్షణ సంస్థల మధ్య తేడా ఏమిటి?
ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుత మార్కెట్కు అవసరమైన అంశాలపై కళాశాలల్లో బోధిస్తున్నా అది అంతగా ఉపయోగపడటం లేదు. అందుకు కారణం అధ్యాపకులు పైపైన చెప్పుకుంటూ పోతారు. సిలబస్ పూర్తికావాలి కాబట్టి వారి హడావిడిలో వారు ఉంటారు. ప్రాక్టికల్స్ ఉన్నా ఆసక్తి చూపేవారు తక్కువ. చాలా కళాశాలల్లో ప్రయోగశాలలూ అంతంతమా త్రమే. ఉన్నా ఆధునిక పరికరాలు కనిపించవు. వాటి గురించి వివరంగా చెప్పే అధ్యాపకులు, నైపుణ్యమున్న ల్యాబ్ సిబ్బంది కూడా ఉండటం లేదు. ఫలితంగా విద్యార్థులు సైతం ప్రాక్టికల్స్ను ఆషామాషీగా తీసుకుంటున్నారు. 'కళాశాలల్లో అధ్యాపకులు కేవలం తమకిచ్చిన సిలబస్ పూర్తికావాలన్నదే లక్ష్యంతో విద్యాబోధన సాగిస్తున్నారు. కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుండటంతో విద్యాసంవత్సరంలో రెండున్నర నెలలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాకుండా వారు కేవలం థియరీ మాత్రమే చెబుతారు. శిక్షణ సంస్థల్లో మాత్రం ప్రస్తుతం ఐటీ సంస్థల్లో ఎటువంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు, లేటెస్టు వెర్షన్లు ఏమిటో అవి మేం చెబుతున్నాం' అని శిక్షణ సంస్థల్లో పాఠాలు చెబుతున్న బోధకులు పేర్కొంటున్నారు.
శిక్షణ పొందినా 25 శాతం మందికే!
ఇక్కడ ఐటీ శిక్షణ సంస్థల్లో ఫీజులు చెల్లించి శిక్షణ పొందినా వారిలో 25 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. అదీ కొంత ప్రతిభ ఉండి ఆంగ్లం మాట్లాడటం, అర్థం చేసుకునే సామర్ధ్యం ఉండి ఆసక్తితో ప్రాక్టికల్స్ చేసి విషయపరిజ్ఞానం పెంచుకున్న వారికేనని ఓ శిక్షణ సంస్థ ప్రతినిధి చెప్పారు. చాలా మంది కొద్ది రోజులు వచ్చి ల్యాబ్కు రాకుండా వెళ్తుంటారని, పట్టుదలతో కృషి చేసేవారే నెగ్గుతారని ఆయన తెలిపారు. మిగతా వాళ్లు ట్రయల్స్ వేస్తూనే ఉంటారని, కొందరు మళ్లీ ఎంటెక్లో చేరతారని పేర్కొన్నారు. అమీర్పేటలో ఓ యువకుడిని కదిలిస్తే నాలుగేళ్ల క్రితం బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తయ్యిందని, ఉద్యోగం రాకపోవడంతో శిక్షణ తీసుకున్న సంస్థలోనే రూ.4 వేల వేతనానికి చేరుతున్నానని చెప్పడం గమనార్హం. కొన్నాళ్ల అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటానన్నారు. నగరంలో శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువగా 2010, 2011, 2012లో డిగ్రీ పట్టాలందుకున్న వారున్నారు. అధిక శాతం మంది హాస్టల్స్లో ఉంటున్నారు.
పొరుగు రాష్ట్రాల వారూ వస్తున్నారు
హైదరాబాద్కు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాల విద్యార్థులు కూడా వస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకు కారణం చైన్నె, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ ఫీజులు మూడు నాలుగు రెట్లు తక్కువగా ఉండటమే. ఇక్కడ రూ.5 వేలకు నేర్పే కోర్సును అక్కడ రూ.25 వేలకుపైగానే తీసుకుంటున్నారు. |