Skip Navigation Links
ప్రధాన కథనాలు
'సీప్-2012'లో 80.02% మందికి అర్హత
* జూన్ 2వ వారంలో వెబ్‌కౌన్సెలింగ్
హైదరాబాద్ : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన 'సీప్-2012' ఫలితాలను ఉప ముఖ్యమంత్రి, ఉన్నత, సాంకేతిక విద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మే 19న విడుదల చేశారు. 2,28,352 మంది విద్యార్థులు సీప్ రాయగా వీరిలో 1,84,778 (80.92%) మంది అర్హత సాధించారు. వీరికి జూన్ 2వ వారంలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్‌రావు పాల్గొన్నారు.
పరీక్ష రాసిన విద్యార్థులు : 2,28,352
అర్హత : 1,84.778 (80.02%)
పరీక్ష రాసిన బాలురు + అర్హత : 1,68,622 - 1,33,839 (79.37%)
పరీక్ష రాసిన బాలికలు + అర్హత : 59,730 - 50,939 (85.28%)
కిందటేడాది 2,19,099 మంది విద్యార్థులు సీప్ రాయగా 89.10% మంది అర్హత సాధించారు. సీప్-2012లో అర్హత సాధించిన వారికి ఈనెల 22వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను పంపిస్తారు. వెబ్‌కౌన్సెలింగ్ తేదీలను తరువాత ప్రకటిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 26వేల వరకు సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో మొదటి, సెకండ్ షిఫ్టుల్లో కలిపి 45వేల వరకు సీట్లు ఉన్నాయి.
మొదటి ర్యాంక్ ముగ్గురికి
సిప్-2012లో మొదటి ర్యాంక్‌ను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన గన్ని సూర్యతేజ, గుబ్బల సాయిచంద్, సాతిరూపశ్రీ హరీందర్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇలాగే అయిదు, పది ర్యాంకుల్లోనూ జరిగింది. సీప్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ర్యాంకులను ప్రకటించారు. సీప్‌లోని అన్ని సబ్జెక్టుల్లో వీరికి సమానంగా మార్కులు వచ్చినందున ఒకే ర్యాంకు ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చింది. మొదటి ర్యాంకు సాధించిన ముగ్గురికి 120 మార్కులకుగాను 118 వచ్చాయి. పుట్టిన తేదీ, ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షల్లో సాధించిన మార్కులను అనుసరించి త్వరలో జరగబోయే వెబ్ కౌన్సెలింగ్‌లో వీరి ప్రతిభా క్రమాన్ని నిర్ణయిస్తామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ శశి రెసిడెన్షియల్ స్కూలు (వలివెన్ను)కు చెందిన వారు కావడం గమనార్హం
ఫీజు పెంచుకోండి
* వృత్తి విద్యా కళాశాలలకు సుప్రీం కోర్టు అనుమతి
* 2012-13 విద్యా సంవత్సరానికి వర్తింపు
* కొత్త విద్యార్థులకే పరిమితం
* వేతన సవరణ అమలుచేసే వారందరికీ ఇదే విధానం
న్యూఢిల్లీ : వృత్తి విద్య కళాశాలలు ఫీజు పెంచుకునేందుకు మార్గం సుగమం అయింది. 2012-13 విద్యా సంవత్సరానికి ఫీజు పెంపునకు సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌కు స్పందించి సమస్త సమాచారం ఇచ్చిన 13 కళాశాలలకు ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు ఫీజు పెంపు వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌కు ఇప్పటివరకూ స్పందించని కళాశాలలు బోధన, బోధనేతర సిబ్బందికి ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 6, 9వ వేతన సవరణ అమలు చేస్తామని అండర్‌టేకింగ్ లెటర్స్ ఇస్తే వాటికీ ఫీజుల పెంపును వర్తింపజేయాలని పేర్కొంది. ఈ పెంపు కేవలం 2012-13 విద్యాసంవత్సరంలో చేరే కొత్త విద్యార్థులకే పరిమితం చేయాలని స్పష్టీకరించింది. పాత విద్యార్థులపై ఎలాంటి భారం మోపరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ఎం లోధా, జస్టిస్ హెచ్ఎల్ గోఖలే, జస్టిస్ రంజన్ గొగోయ్‌ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వృత్తివిద్యా సంస్థల్లో ఏకీకృత ఫీజు విధానం అమలుచేయాలని చెబుతూ 2011 అక్టోబర్ 29న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన ఈ కేసు తుది విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 25కి వాయిదావేసింది. ''సమస్యకు మేం ఇక్కడ తాత్కాలిక పరిష్కారం చూపుతున్నాం. తమ దరఖాస్తులను ఏఎఫ్ఆర్సీ పరిగణనలోకి తీసుకోలేదని కొన్ని కళాశాలలు చెబుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందికి 6, 9వ వేతన సవరణలు అమలుచేస్తూ.. ఏఎఫ్ఆర్సీకి తగు రీతిలో దరఖాస్తు చేసుకోలేని విద్యాసంస్థలకూ పెంపును వర్తింపజేయాలి. ఫీజు పెంపును ఆశిస్తున్న విద్యాసంస్థలు తాము ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం బోధనాసిబ్బందికి ఆరో వేతన సవరణ, బోధనేతర సిబ్బందికి తొమ్మిదవ వేతనసంఘం సిఫార్సులు అమలు చేస్తున్నట్లు న్యాయస్థానానికి వారంలోపు అండర్‌టేకింగ్ లెటర్స్ ఇవ్వాలి. తర్వాత వారంలోపు పెరిగిన ఆర్థికభారాన్ని వివరిస్తూ ఏఎఫ్ఆర్సీకి లెక్కలు సమర్పించాలి. ఈ షరతులను అమలు చేసే కళాశాలలకు 13 కళాశాలలతోపాటే ఫీజు పెంపును వర్తింపజేయాలి. ఆ కళాశాలలు సమర్పించే లెక్కలను పరిశీలించిన అనంతరం ఏఎఫ్ఆర్సీ సంతృప్తి చెందినంతమేరకు పెంపును వర్తింపజేయాలి. అలాగే సమస్త సమాచారం అందించిన 13 కళాశాలల్లో దేనికెంత ఫీజు పెంచాలో సిఫార్సు చేస్తూ ఏఎఫ్ఆర్సీ ఈ నెల 5న దాఖలు చేసిన నివేదికను ఆమోదిస్తున్నాం. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల ప్రకారం ఫీజు పెంపు ద్వారా తలెత్తే ఆర్థిక భారాన్ని 2012-13 విద్యాసంవత్సరంలో చేరే కొత్త విద్యార్థులపైనే మోపాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పాత విద్యార్థులపై రుద్దరాదు. 2012-13లో అమలు చేసే ఫీజు పెంపు ద్వారా విద్యార్థులపై పడే అధిక భారాన్ని 2013-14, 14-15, 15-16 విద్యాసంవత్సరాల్లో సర్దుబాటు చేస్తూ ఉపశమనం కలిగించాలి'' అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫీజు పెంపును కేవలం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కళాశాలలకే వర్తింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి పిటిషన్ దాఖలు చేస్తారని, అప్పుడేం చేస్తామని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇప్పుడున్న ద్వంద్వ ఫీజు విధానాన్ని రద్దుచేసి ఏకీకృత ఫీజును అమలు చేయాలన్న విజ్ఞప్తినీ కోర్టు మన్నించలేదు. తామిప్పుడు 2012-13 సంవత్సరం ఫీజు పెంపునే పరిగణనలోకి తీసుకుంటున్నందున ప్రస్తుతం ఆ విషయం జోలికి పోవడం లేదని స్పష్టం చేసింది. విద్య, వైద్యరంగం వ్యాపారంగా మారడం పట్ల ఈ సందర్భంగా న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ''విద్య, వైద్యరంగాలు ధార్మిక ధోరణితో పని చేయాలి. వ్యాపారం, లాభాపేక్షలు వాటికి ఉండకూడదు. కానీ, ఈ రెండురంగాలు ఇప్పుడు వ్యాపారమయం అయ్యాయి'' అని జస్టిస్ ఆర్ఎం లోధా ఆవేదనగా వ్యాఖ్యానించారు.
2 నుంచి 50% వరకు ఫీజు పెంపు
ప్రస్తుతం సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులవల్ల 2012-13 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులపై ఫీజు భారం 2 నుంచి 50 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కళాశాలల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్ఆర్ఐ కోటాల ప్రకారం ఫీజు వసూలుచేస్తున్నారు. కోర్టు తీర్పువల్ల ఈ మూడు విభాగాల ఫీజు పెరుగుతుందని బుధవారం న్యాయస్థానానికి వచ్చిన కళాశాలల ప్రతినిధులు తెలిపారు. కన్వీనర్ కోటా విద్యార్థుల్లో 40 శాతం నుంచి 50 శాతం మందికి ఫీజు రీఎంబర్స్‌మెంట్ వర్తిస్తుంది కాబట్టి ఆ పెంపును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మిగతా కేటగిరీల ఫీజులన్నీ విద్యార్థులు సొంతంగా చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులు అనర్హులు
* పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
* రాతపరీక్షలు యథాతథం
హైదరాబాద్: పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతోపాటు తమకూ అవకాశం కల్పించాలని కోరుతూ తెలుగుమీడియం అభ్యర్థులు రెండు నెలలుగా హైకోర్టులో పోరాడుతున్నారు. దీనిపై ఈరోజు తుది విచారణ చేపపట్టిన హైకోర్టు తెలుగుమీడియం అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ పిటీషన్ కొట్టివేసింది. గతంలో ప్రభుత్వం పెట్టిన సక్సెస్ స్కూళ్లలో తెలుగుమీడియం అభ్యర్థులకు అవకాశం ఇవ్వటంతో పూర్తిస్థాయి ఫలితాలు సాధించలేకపోయామని అందువల్ల ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చేసిన వాదనకు దీంతో బలం లభించింది. తాజాగా హైకోర్టు నిర్ణయంతో మే 10, 11, 13 తేదీల్లో తలపెట్టిన టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ రాతపరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. 10, 11 తేదీల్లో జరిగే టీజీటీ, పీజీటీ రాతపరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 271 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ పోస్టులకు రాతపరీక్షలు మే 13న హైదరాబాద్‌లో జరగనున్నాయి.
సాంకేతిక విద్య వల్లే భారత్‌కు మంచి గుర్తింపు
* నారాయణమూర్తి
హైదరాబాద్: సాంకేతిక విద్య ద్వారానే ప్రపంచదేశాలు భారత్‌ను బలమైన శక్తిగా గుర్తించే అవకాశం దక్కిందని దీన్ని నేటి విద్యార్థులు మరింత ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. జేఎన్‌టీయూలో గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించిన ఆయన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసియాలోనే ఎక్కువ బిలియనీర్లు ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో అదే స్థాయిలో పేదరికం కూడా ఉందని ఆయన అన్నారు. నిరక్షరాస్యత, కలుషితనీరు, అపరిశుభ్రత భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్యలని అన్నారు. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులే కారణమని అన్నారు. యువత ప్రజల సమస్యలను దూరం చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ నారాయణమూర్తిలోని అణకువ, ముందుచూపును ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు.
డిగ్రీ లెక్చరర్స్ పరీక్ష వాయిదా
* ఏపీపీఎస్సీ ఛైర్మన్ రేచల్ ఛటర్జీ ప్రకటన
హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్స్(డీఎల్) పరీక్షను మే 6న నిర్వహించాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ రేచల్ ఛటర్జీ ప్రకటించారు. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు. ప్రశ్నాపత్రాలు నిర్ణీత సమయానికి పరీక్షాకేంద్రానికి చేరకపోవడంతో పరీక్షనిర్వహణలో గందరగోళం నెలకొంది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు మే 6న నిర్వహించాల్సి ఉండగా పేపర్-1 పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పేపర్-2 పరీక్షను వాయిదావేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. నగరంలో 8పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు చోట్ల పేపర్-1 పరీక్షను అభ్యర్థులు అడ్డుకున్నారు. దీంతో పేపర్-1, 2 పరీక్షను వాయిదావేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. డీఎల్ నోటిఫికేషన్‌కు సంబంధించి 657 పోస్టులకు 5 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల
* తొలి రెండుస్థానాలూ అమ్మాయిలవే
* డాక్టర్ షేనా అగర్వాల్‌కు మొదటి ర్యాంకు
* రుక్మణికి రెండో ర్యాంకు
* ఆంధప్రదేశ్ కుర్రాడు కృష్ణభాస్కర్‌కు 9వ స్థానం
న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాది కూడా సివిల్ సర్వీసు పరీక్షల్లో తొలి రెండు స్థానాలను మహిళలే కైవసం చేసుకున్నారు. 2011 సివిల్‌సర్వీస్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ మే 4న విడుదల చేసింది. అఖి భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న షేనా అగర్వాల్ తొలి స్థానాన్ని సాధించారు. ముంబయి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ నుంచి సోషల్ ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌లో పీజీ చేసిన రుక్మణి రియార్ రెండో స్థానంలో నిలిచారు. ఢిల్లీ ఐఐటీ నుంచి ఎంటెక్ చేసిన ప్రిన్స్ ధావన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆంధప్రదేశ్ కుర్రాడు డి.కృష్ణభాస్కర్ 9వ ర్యాంకు సాధించారు. కృష్ణభాస్కర్.. సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్థసారధి భాస్కర్ కుమారుడు. 2010లో చెన్నైకి చెందిన లా విద్యార్థి ఎస్.దివ్యదర్శిని మొదటి స్థానం సాధించగా, హైదరాబాద్‌కు చెందిన శ్వేతామొహంతి రెండో స్థానం సాధించారు.
జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన మరికొందరు
కడపకు చెందిన డా. మల్లికార్జున: 20వ ర్యాంకు
పవన్‌కుమార్ మాలపాటి: 53వ ర్యాంకు
శివప్రకాశ్ దేవరాజ్: 141వ ర్యాంకు
శ్వేత: 163వ ర్యాంకు
సీరం సాంబశివరావు:164వ ర్యాంకు
శశాంక్‌సాయి:173వ ర్యాంకు
గుడిమెళ్ల పవన్‌కుమార్: 247వ ర్యాంకు
2011 సివిల్ సర్వీస్ ఫలితాల వివరాలు..
* దరఖాస్తు చేసిన వారి సంఖ్య 4,72,290.
* ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తేదీ జూన్ 12.
* దీనికి హాజరైన వారి సంఖ్య 2,43,003.
* ప్రధాన పరీక్షకు ఎంపికయిన వారి సంఖ్య 11,984.
* ప్రధాన పరీక్ష నిర్వహించింది అక్టోబరు-నవంబరులో.
* వ్యక్తిత్వవిలక్షణత పరీక్షకు ఎంపికయింది 2,417 మంది.
* ఈ పరీక్ష నిర్వహించింది 2012 మార్చి-ఏప్రిల్‌లో.
* 2,417 మందిలోఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీసులకు మొత్తం 910 మందిని ఎంపిక చేశారు. ఇందులో 715 మంది పురుషులు. 195 మంది మహిళలు.
* వీరిలో 420 మంది జనరల్(21 మంది వికలాంగులతో కలిపి). 255 మంది బీసీలు (8 మంది వికలాంగులతో కలిపి).ఎస్సీలు 157 మంది. (నలుగురు వికలాంగులతో కలిపి). 78 మంది గిరిజనులు.
* విజేతలు ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వారు కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు.
* తొలి 25 మంది విజేతల్లో ఢిల్లీ కేంద్రం నుంచి 13 మంది ఉన్నారు. జైపూర్-2, ముంబయి-2, చండీగఢ్-2, హైదరాబాద్-1, చెన్నై-1, దిస్‌పూర్-1, పాట్నా-1, జమ్మూ-1.
* తొలి 25 మంది విజేతల్లో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటీల వంటి ప్రతిష్ఠాత్మాక విద్యాసంస్థల పూర్వవిద్యార్థులున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ విద్యార్థీ ఉన్నారు.
* ఈ 25 మంది కుటుంబ నేపథ్యమూ భిన్న రకాలు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారూ ఉన్నారు.. వ్యాపార నేపథ్యం నుంచి వచ్చిన వారూ ఉన్నారు. దిగువ, మధ్య శ్రేణి ప్రభుత్వోద్యోగుల పిల్లలు, వైద్యులు, న్యాయవాదుల కుటుంబాల నుంచి వచ్చినవారూ ఉన్నారు.
* వారిలో ఆరుగురు తొలి ప్రయత్నంలోనే విజయం కైవసం చేసుకోగా ఏడుగురు రెండో ప్రయత్నంలో సాధించారు. 9 మంది మూడో ప్రయత్నంలో, నాలుగు, ఐదు, ఆరో ప్రయత్నాల్లో ఒకొక్కరు విజయం సాధించారు.
* పూర్తి వివరాలకు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు యూపీఎస్సీ సేవా కేంద్రంలో వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు లేదా 011-23385271, 23381125, 23098543 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
* యూపీఎస్సీ వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను ఉంచారు. మార్కులు మాత్రం మరో 15 రోజుల్లో అందుబాటులో ఉంచుతారు.
ఫలితాలు
వెబ్‌సైట్‌లో జేఈఈ కీ
* 5-10 తేదీల మధ్య విద్యార్థుల ఓఆర్ఎస్ పత్రాల ప్రదర్శన
* సందేహాలుంటే 10లోగా ఫిర్యాదు చేయొచ్చు
* 18న ఫలితాలు
* ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వెల్లడి
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2012 జవాబుల(కీ)తో పాటు, విద్యార్థుల జవాబు పత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఐఐటీలు నిర్ణయించాయి. మే 3వ తేదీన కీ, మే 5-10 మధ్య మూల్యాంకనం చేసిన విద్యార్థుల ఆప్టికల్ రెస్పాన్స్ షీట్స్ (ఓఆర్ఎస్)ను జేఈఈకి చెందిన అన్ని వెబ్‌సైట్‌లలో ఉంచుతారని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ఆర్.కె.శివగాంకర్ మే 2న న్యూఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను మాత్రం మే 18న వెబ్‌సైట్‌లో పెడతామని చెప్పారు. ఈలోగానే విద్యార్థులు తాము రాసింది సరైందో కాదో చూసుకోవచ్చన్నారు. ఫలితాల వెల్లడికి ముందే విద్యార్థులు తమ అభ్యంతరాలు వ్యక్తపరిచేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశామని తెలిపారు. ''విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ఏమైనా అభ్యంతరాలుంటే అందులోనే ఫిర్యాదు చేయొచ్చు. అన్ని ఐఐటీలకు చెందిన అధ్యాపక బృందం ఈ ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఫిర్యాదు అర్థవంతమైనదైతే, ఏదైనా తప్పు దొర్లివుంటే దాన్ని సరిచేస్తుంది అని చెప్పారు. యంత్రం సాయంతో మూల్యాంకనం చేసిన ఓఆర్ఎస్‌లను మార్కులతో సహా ప్రదర్శిస్తామన్నారు. తప్పులు జరిగాయని భావిస్తే మే 10లోగా పునఃపరిశీలనకు అభ్యర్థించాలని కోరారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 4.79 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. మూల్యాంకనం సక్రమంగా జరిగిందని విద్యార్థులు సంతృప్తి చెందాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదులు తక్కువగానే వస్తాయని భావిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో జరగనున్న ఇండో-గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్
హైదరాబాద్ : ఇండో-గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్-2012కు హైదరాబాద్ అతిథ్యమివ్వనుంది. వచ్చే సెప్టెంబరు 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న సమ్మిట్‌లో ఉన్నత విద్యా రంగం అభివృద్ధి గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా విదేశీ విశ్వవిద్యాలయాల గురించి ఒప్పందాల అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని నిర్వహణ సందర్భాన్ని పురస్కరించుకుని ది హిందూస్ ఫౌండేషన్ మే 1న హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య, నిర్వాహకులు మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళిక ఉన్నత విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేస్తున్న వీరిలో కేవలం 15% మంది విద్యార్థులకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు. విద్యా రంగం అభివృద్ధికి ముఖ్యమైన మార్పులను తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వృత్తివిద్య నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందింపచేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..సెప్టెంబరులో జరగనున్న సదస్సు ద్వారా పంపే సిఫార్సులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వాటి అమలుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ సాంకేతిక రంగాల్లో తీసుకురావల్సిన మార్పులపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. విదేశాల్లో విద్యా రంగానికి చెందిన వివిధ హోదాల్లో ఉన్న 1200 మంది ఈ సదస్సులో పాల్గొననున్నారు. సుమారు 15వేల మంది విద్యార్థులకు విదేశీ, స్వదేశీ విద్యపై అవగాహన కల్పించనున్నారు.
త్వరలో మరో పది ఎన్ఐటీలు
* కపిల్ సిబల్ వెల్లడి
* రాజ్యసభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో మరో పది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర మావనవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఏప్రిల్ 30వ తేదీన రాజ్యసభలో తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య భారతంలో వీటిని నెలకొల్పుతామన్నారు. ఐటీ-బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఐఐటీగా మార్చాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఐఐటీ ఛైర్మన్‌గా బీహెచ్‌యూ వీసీ ఉంటారని, బీహెచ్‌యూ స్వయంప్రతిపత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టంచేశారు. ఈ మేరకు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సవరణ) బిల్లు-2011, ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సవరణ)-2010 బిల్లులను సిబల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
భౌతికశాస్త్ర ప్రశ్నలే కొంత కఠినం
* నిపుణుల విశ్లేషణ
* ముగిసిన ఏఐఈఈఈ రాత పరీక్ష
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 29న నిర్వహించిన ఆల్ఇండియా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఈ) రాత పరీక్షలోనూ భౌతిక శాస్త్రం ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చాయని విద్యార్థులు, నిపుణులు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన జరిగిన ఐఐటీ- జేఈఈలోనూ భౌతికశాస్త్రం ప్రశ్నలు ఈ తరహాలోనే వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వరంగల్, తిరుపతి, గుంటూరు నగరాల్లో ఏప్రిల్ 29న ఏర్పాటుచేసిన ఏఐఈఈఈ పరీక్ష కేంద్రాల ద్వారా సుమారు 80 వేల మంది హాజరయ్యారు. ఒక్క వరంగల్ నగరంలోనే సుమారు 35 వేల మంది రాశారు. మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించగా గణితం, భౌతికరసాయన శాస్త్రాల సజ్జెక్టులకు కలిపి 90 ప్రశ్నలిచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 30 ప్రశ్నలున్నాయి. ఒక్కో దానికి నాలుగు మార్కులు. వీటిల్లో భౌతిక శాస్త్రం ప్రశ్నలతో విద్యార్థులు కొంత ఇబ్బంది నెదుర్కొన్నారు. సుమారు 10 ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మెదడుకు పదును పెట్టే రీతిలో ఉన్నాయని ఐఐటీ జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్‌కుమార్ చెప్పారు. గణితంలో నాలుగైదు, రసాయన శాస్త్రంలో మూడునాలుగు ప్రశ్నలు ఈ రకంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే మొత్తం మీద 10 శాతం కఠిన ప్రశ్నలు తగ్గాయని టైమ్ సంస్థ ప్రతినిధులు విశ్లేషించారు. మొత్తం మీద 310 మార్కులు వస్తే మొదటి పది ర్యాంకుల్లో ఉంటారని లలిత్‌కుమార్ అంచనావేశారు. ఇంజినీరింగ్‌లో భౌతికశాస్త్రం కీలకంగా మారుతోందని, అందుకే జాతీయస్థాయి పరీక్షల్లో ఆ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు. ఇక నుంచి భౌతికశాస్త్రం సబ్జెక్టుపై మన రాష్ట్ర విద్యార్థులూ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. సరిపోని రఫ్ పేపర్ : మొత్తం 24 పేజీల బుక్‌లెట్ విద్యార్థులకు ఇవ్వగా అందులో కేవలం రెండు పేజీలే రఫ్ వర్క్ చేయడానికి కేటాయించారు. ఫలితంగా మొత్తం 90 ప్రశ్నలకు సమాధానం గుర్తించేందుకు రఫ్ వర్క్ చేయడానికి స్థలం సరిపోక విద్యార్థులు ఇబ్బందిపడ్డారు.
రెవెన్యూలో 4,620 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు
* మంత్రి రఘువీరా వెల్లడి
* నూతన వీఆర్‌వో, వీఆర్ఏల బాధ్యతల స్వీకరణ మే 1న
హైదరాబాద్: రెవెన్యూలో ఉన్న 4,620 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసి తీసుకు రావాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను కోరారు.
ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి రెవెన్యూ అంశాలపై ఆయన ఏప్రిల్ 27న లేక్‌వ్యూ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులకు సమావేశ వివరాలను తెలియజేశారు.
* ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామ రెవెన్యూ కార్యదర్శులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) మే ఒకటో తేదీ నుంచి బాధ్యతలను నిర్వర్తిస్తారు. ప్రతిభ ప్రాతిపదికగా వీరి నియామకం జరిగింది. ప్రతిభావంతుల జాబితాను కేరళలో వరుసగా మూడేళ్లు ఉపయోగించుకుంటున్నారు. అదే తరహాలో రెవెన్యూలో భవిష్యత్‌లో చేపట్టే నియామకాలకు ఒక ఏడాదిపాటు ఉపయోగించుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించి తెలియజేయాలని మంత్రి అధికారులను కోరారు. డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్ఓ, వీఆర్ఏ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, తదితర పోస్టులు మొత్తం 4,620 ఖాళీగా ఉన్నందున వాటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్
* ఈ ఏడాదికే పరిమితం
* తొలుత ఫిజిక్స్ ఫలితాల వెల్లడి
హైదరాబాద్: భౌతికశాస్త్రం ప్రశ్నపత్రం రూపకల్పన తీరుపై చెలరేగిన దుమారాన్ని సర్దుబాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏప్రిల్ 26న అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులో ఇంప్రూవ్‌మెంట్ కింద పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా.. తొలుత ప్రకటించినట్లు మే 23వ తేదీ నుంచి కాకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వారం ముందుగానే అంటే.. 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి విడతల వారీగా ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించిన విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చేరవేసి, ఆయన నుంచి ఆమోదం పొందిన అనంతరం ఏప్రిల్ 26న సచివాలయంలో కీలక ప్రకటన చేశారు.
* సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులను ఇంప్రూవ్‌మెంట్ కింద రాసేందుకు వీలుకల్పిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు.
* విద్యార్థుల మానసిక స్థితి, వారి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకోవల్సి వచ్చిందని స్పష్టంచేశారు.
* భౌతికశాస్త్రం ప్రశ్నపత్రం రూపకల్పనపై చెలరేగిన దుమారంతో కాగితంపై నిబంధనలు లేకున్నా ప్రభుత్వం విశేష అధికారాలను ఉయోగించి.. సీనియర్ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
* భౌతిక శాస్త్రం పరీక్షలో మాత్రమే ఉత్తీర్ణత తగ్గినప్పటికీ .. ఇతర సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలనుకున్న వారిని నిరుత్సాహ పరచకూడదన్న ఉద్దేశంతో అందరికీ ఇంప్రూవ్‌మెంట్ నిర్ణయాన్ని అమలుచేస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు.
* తొలుత ప్రకటించిన ప్రకారం వచ్చేనెల 23వ తేదీ నుంచి పరీక్షలు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాలి. మారిన పరిస్థితుల్లో ఈ పరీక్షలను వచ్చేనెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో కూడా సంప్రదాయానికి భిన్నంగా ఫిజిక్స్ పరీక్షను ముందుకు తీసుకువచ్చారు.
* వచ్చేనెల 16నే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్‌లో పరీక్షను నిర్వహిస్తారు. ఇంప్రూవ్‌మెంట్ కింద పరీక్ష రాసే వారికి ప్రయోగపరీక్షలు ఉండవు.
* ఫిజిక్స్ పరీక్ష ముగిసిన మరసటిరోజే జవాబుపత్రాల మూల్యాంకనం మొదలవుతుంది.
* మార్చి పరీక్ష ఫలితాలతోనే.. ఎంసెట్ ర్యాంకులను మార్చి పరీక్ష ఫలితాలనే వెల్లడిస్తారని మంత్రి పార్థసారధి వెల్లడించారు. అడ్వాన్డ్సు పరీక్షల ద్వారా ఉత్తీర్ణత అయ్యే వారికీ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలు లభిస్తాయని చెప్పారు. అందరికీ న్యాయం చేకూరుతుందన్నారు.