Skip Navigation Links

ప్రధాన కథనాలు
ఫీజుల నియంత్రణపై సమగ్ర అధ్యయనం!

* మంత్రివర్గ ఉపసంఘం ద్వారా విధాన నిర్ణయాలు
హైదరాబాద్: పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై సమగ్రంగా అధ్యయనం చేసి, తగిన విధానపరమైన నిర్ణయాలను మంత్రివర్గ ఉపసంఘం తీసుకోనుందని విద్యాశాఖ ఇంఛార్జి సంచాలకులు ఉషారాణి జూన్ 18న వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతుందని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో హైదరాబాద్, రంగారెడ్డి నుంచి మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. వీటిని పరిష్కరిస్తున్నామన్నారు. యజమానులు ఏ పేర్లతోనైతే గుర్తింపు పొందారో వాటిని మాత్రమే పాఠశాలలకు బోర్డులుగా ఉంచాలని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే పాఠశాలల విషయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే..కొంతమంది లక్షలాది రూపాయలను వెచ్చించి బోర్డులను తయారుచేశారని, దానివల్ల వాటిని తొలగించే విషయంలో ఆలోచించాల్సి వస్తుందన్నారు. కృష్ణా, కర్నూలు, ఇతర జిల్లాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఆకర్షణీయ పేర్లతో ఉన్న బోర్డులను తొలగించే ప్రక్రియ మొదలైందన్నారు.

నెలాఖరుకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌?
హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ఫీజు ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేవారం ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఎఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. ఈ మేరకు ఎఎఫ్‌ఆర్‌సీలో కసరత్తు జరుగుతోంది. మరోవైపు రూ.35వేలరుసుము కోరుతూ అందుకు తగినట్లు వివరాలు సమర్పించని కళాశాలల యాజమాన్యాలు సానుకూల ఉత్తర్వుల కోసం ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నాయి. న్యాయస్థాన ఆదేశాలు అనుసరించి వివరాలు సమర్పించకుంటే.. అటువంటి కళాశాలల్లో ఫీజులను ఖరారు చేయకూడదు. ఈ గండం నుంచి గట్టెక్కించాలని కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాయి. ఇందుకు తగిన హామీ వాటికి లభించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్‌సీ వచ్చేవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. వీటి ఆధారంగా ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావల్సి ఉంది. వీటిపై అవగాహన వచ్చిన అనంతరమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజమాన్య కోటా ఉత్తర్వులపై హైకోర్టు 'స్టే' విధించినందున త్వరలోనే కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఉన్నత విద్యా అధికారులు సమయాత్తమవుతున్నారు. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి.
'లాసెట్- 2013' ఫలితాలు విడుదల
తిరుపతి (ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం జూన్ 6న నిర్వహించిన లాసెట్-2013 ఫలితాలను జూన్ 17న సాయంత్రం వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉదయగిరి రాజేంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల డిగ్రీ లాసెట్‌కు 14,391 మంది హాజరుకాగా 12,808 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఐదేళ్ల డిగ్రీ లాసెట్‌కు 3,627 మంది హాజరుకాగా 2,978 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. పీజీ లాసెట్‌కు 1,515 మంది హాజరుకాగా 1,504మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మూడు కోర్సులకు సంబంధించి మొదటి పదిస్థానాల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా పరిధిలోని విద్యార్థులు ప్రతిభ చాటారని ఉపకులపతి పేర్కొన్నారు. మూడేళ్ల లాసెట్‌లో మొదటి మూడుస్థానాల్లో ఆర్ఎస్ శ్రావణ్‌కుమార్ (ఓయూ), పి.సుధీర్‌బాబు (ఏయూ), ఎన్.బాలకృష్ణ (ఓయూ) నిలిచారు. ఐదేళ్ల లాసెట్‌లో ఉస్మానియా వర్సిటీ పరిధిలోని బి.కోటేశ్వరరావు, వి.నాగరాజు, ఎ.మల్లేష్ వరుస స్థానాల్లో నిలిచారు. పీజీ లాసెట్‌లో ఎం.జ్యోతిశ్రీ(నాన్‌లోకల్), ఓయూకు చెందిన ఎం.వెంకటరామనాగలక్ష్మి, జి.వైష్ణవ్‌కుమార్ వరుస స్థానాలు దక్కించుకున్నారు.
Top 10 Candidates (3 years LLB)
Top 10 Candidates (5 years LLB)
Top 10 Candidates (PGLCET)
RESULTS
సీటెట్- 2013కు ఏర్పాట్లు
* పొరపాట్ల సవరణకు గడువు జూన్ 27.
* పరీక్ష జులై 28న.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో టీచర్ పోస్టులకు అర్హత పరీక్షగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ టెట్)- 2013 జులై 28న జరుగుతుందని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) డైరెక్టర్ జూన్ 17న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఫొటోలను, దరఖాస్తు వివరాలను సీటెట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని వీటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయోమో అభ్యర్థులు తనిఖీ చేసుకోవాలని డైరెక్టర్ చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్ కరెక్షన్ విధానాన్ని జూన్ 16 నుంచి 27 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పరీక్ష కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఎవరిదైనా తమకు చేరలేదని భావిస్తే వారు కూడా సీబీఎస్ఈ కార్యాలయంలో జూన్ 27 వరకు సంప్రదించవచ్చని చెప్పారు.
ఉదార ఉత్తీర్ణతపై పునరాలోచన చేయండి
* కేంద్రానికి పార్లమెంటు స్థాయీసంఘం సిఫారసు
న్యూఢిల్లీ: ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బడిలో విద్యార్థి చదివినా చదవక పోయినా పై తరగతికి పంపించేలా కేంద్రం తెస్తున్న 'ఉదార ఉత్తీర్ణత' (ఆటోమేటిక్ ప్రమోషన్) విధానాన్ని పార్లమెంటు స్థాయీ సంఘం జూన్ 16న తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విధానంపై పునరాలోచించుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరింది. ఈ విధానం విద్యార్థిలో కష్టపడి చదవాలన్న ప్రేరణ కల్పించదని తెలిపింది. బాలల్లో ప్రతి ఒక్కరికీ సంతృప్తికరమైన, సమాన ప్రమాణాలున్న విద్యను సర్వశిక్ష అభియాన్, విద్యాహక్కు చట్టం కల్పిస్తున్నాయి. ఈ విద్యకు కొన్ని తప్పనిసరి పద్ధతులు, ప్రమాణాలుండాలని నిర్దేశిస్తోందని చెప్పింది. 'ఉదార ఉత్తీర్ణత' విధానం వల్ల విద్యార్థిలో ఆ ప్రేరణ సన్నగిల్లే ప్రమాదముందని చెప్పింది. పై తరగతికి తప్పకుండా వెళతాననే హామీ విద్యార్థికి లభించినప్పుడు ఆ విద్యార్థులు కష్పపడి నేర్చుకోవాలనే ప్రేరణ కల్పించలేక పోతుందని కమిటీ అభిప్రాయపడింది. స్థాయీ సంఘం తన నివేదికలో 'గ్రామీణ వార్షిక విద్యా స్థితి నివేదిక-2012'లో కొన్ని అంశాలను ప్రస్తావించింది. 2010లో ఐదో తరగతి విద్యార్థులు 46.3 శాతం మంది రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవలేక పోయారు. 29.1 శాతం కనీసం రెండు అంకెల తీసివేతను చేయడానికి తంటాలు పడ్డారు. ఇక భాగహారం చేయలేని ఐదో తరగతి విద్యార్థుల శాతం ఏటా పెరుగుతోంది. 2010లో 63.8, 2011లో 72.4, 2012లో 75.2 శాతం మంది విద్యార్థులు భాగహారం చేయలేక పోయారు. ఇవన్నీ విద్యార్థులకు బోధిస్తున్న విద్యానాణ్యతను ప్రశ్నార్థకంగా మార్చేసేవే అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉదార ఉత్తీర్ణత విధానంపై పునరాలోచించుకోవాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ శాఖకు స్థాయీ సంఘం సూచించింది.
ఇతర రాష్ట్రాల్లో చదివినా ఉద్యోగం
* నిబంధనలు సడలించిన పశువైద్య వర్సిటీ
హైదరాబాద్: పశువైద్య కళాశాలల్లో సహాయ ఆచార్యుల నియామకాల కోసం నిబంధనలను సడలిస్తూ శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో పశువైద్య కోర్సు చదివిన వారిని సైతం ఇక్కడ సహాయ ఆచార్యులుగా నియమించాలని నిర్ణయించింది. ఇంతకాలం ఈ వెసులుబాటు లేదు. ఆచార్యులు లేనందున కరీంనగర్ జిల్లా కోరుట్ల, కడప జిల్లా ప్రొద్దుటూరు, కృష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతించేది లేదని ఇటీవల భారత పశువైద్య మండలి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు నిబంధనలను సడలించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో చదివిన వారిని ఇక్కడ కేవలం జనరల్ కేటగిరీ పోస్టుల్లోనే నియమిస్తామని వర్సిటీ తెలిపింది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి అవకాశం ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని ప్రస్తుతం రాష్ట్రంలో పశువైద్య కోర్సు చదువుతున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రిజర్వుడ్ కేటగిరీ పశువైద్య పట్టభద్రుల కొరత తీవ్రంగా ఉంది.
బీవీఎస్సీకే సహాయ ఆచార్యులు
రాష్ట్రంలో బీవీఎస్సీ ఉత్తీర్ణులవగానే ఉద్యోగాలు వస్తున్నందున పశువైద్య పీజీ కోర్సు పూర్తి చేసిన వారి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో... ఇకనుంచి సహాయ ఆచార్యుల పోస్టులకు సైతం పశువైద్య డిగ్రీ ఉత్తీర్ణులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి ఉద్యోగం ఇచ్చిన అనంతరం మూడేళ్లలోగా పీజీ పూర్తి చేయడానికి అనుమతిస్తారు. అది పూర్తి చేసి పట్టా తెచ్చిన తర్వాతే 'సహాయ ఆచార్యులుగా ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలనే నిబంధన తాజాగా పెట్టారు.
త్వరలో భారీగా ఉపాధ్యాయ నియామకాలు
* ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్
సికింద్రాబాద్: త్వరలోనే భారీగా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జూన్ నెలాఖరులోగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎన్.శైలజానాథ్ చెప్పారు. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండి ప్రభుత్వ స్కూలు ప్రాంగణంలో జూన్ 12న 'సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడారు. త్వరలోనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నామని, అన్ని ప్రభుత్వ బడులకు కొత్త భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం మనదేనన్నారు. కొత్త అంశాలను జోడించిన కారణంగానే పలు తరగతుల పాఠ్యపుస్తకాల రూపకల్పనలతో జాప్యం జరిగిందనీ...సీఎం సైతం సమీక్షించి నెలాఖరులోగా పుస్తకాలు సిద్ధం చేసేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. డైట్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుపుతున్నామన్నారు. బధిర, ఇతర వైకల్యాలున్న విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారికి అవసరమైన వినికిడి యంత్రాలు పంపిణీ చేస్తామన్నారు.
వైద్యవిద్యలో సంస్కరణలకు ఎంసీఐ నిర్ణయం
* పీజీలో కొత్తగా 'ఫ్యామిలీ మెడిసిన్‌', 'ఎమర్జెన్సీ మెడిసిన్‌' కోర్సులు
* అన్ని జబ్బులకూ ఒకే వైద్యుడు
* ప్రజలకు ఆర్థికభారాన్ని తగ్గించటమే లక్ష్యం
ఈనాడు - హైదరాబాద్‌: ప్రజలకు అందే వైద్యసేవలను మెరుగుపరచడానికి భారత వైద్య మండ‌లి (ఎంసీఐ) వైద్యవిద్యలో సంస్కరణలను ప్రారంభించింది. వివిధ‌ రకాల ఆరోగ్యసమస్యలకు ఒకే వైద్యుడి పర్యవేక్షణలో చికిత్సలు అందించేందుకు వీలుగా 'ఫ్యామిలీ మెడిసిన్‌' పేరుతో కొత్త స్పెషాలిటీ (పీజీ) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ తర్వాత‌ జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషీయా, ఈఎన్‌టీ, పిడియాట్రిక్స్‌.. ఇలా ఒక్కో విభాగం కింద ప్రత్యేక కోర్సులు చేయడానికి అవకాశం ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసినవారు ఆ రంగంలో మాత్రమే నిపుణులుగా రాణిస్తారు. దీంతో వ్యాధిగ్రస్థులు ఏదైనా జబ్బు ఉంటే సంబంధిత‌ నిపుణుడి వద్దకే వెళ్లే పరిస్థితి ఉంది. రెండుమూడు రకాల జబ్బులుంటే ఇద్దరు ముగ్గురు వైద్యులను సంప్రదించాల్సిందే. కానీ కొత్తగా రానున్న 'ఫ్యామిలీ మెడిసిన్‌' కోర్సులో అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. అందువల్ల ఈ కోర్సు పూర్తి చేసుకున్న వైద్యనిపుణులు వివిధ‌ రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సను అందించడానికి తగిన సామర్థ్యాన్ని సాధిస్తారు. ఫలితంగా ఒక‌టి కంటే ఎక్కువ‌ ఆరోగ్యసమస్యలతో బాధపడేవారెవ‌రైనా ఒకే వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుంది. ఈ కోర్సు పాఠ్యాంశాలను ఎంసీఐ నిపుణులు ఇప్పటికే రూపొందించారు. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అమలుల్లోకి రానుంది.
ప్రస్తుత‌మున్న కోర్సుల్లోనూ మార్పులు
ప్రజల అవసరాల దృష్ట్యా 'ఫ్యామిలీ మెడిసిన్‌', 'ఎమర్జెన్సీ మెడిసిన్‌' పీజీ కోర్సుల ప్రవేశాలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే అవి అమల్లోకి వస్తాయని వైద్యవిద్యాశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు. మొద‌ట వీటిని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అనుమతించాలనే అంశాన్ని ఎంసీఐ పరిశీలిస్తోందన్నారు. ఈ రెండు కోర్సులు అందుబాటులోకి వస్తే.. పదేళ్లలో దేశవ్యాప్తంగా వైద్యనిపుణుల కొరత చాలా వరకు తీరుతుందని తెలిపారు. ఇదే తరహాలో ఇప్పుడున్న కోర్సుల్లోనూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావల్సిన అంశం ఎంసీఐ పరిశీలనలో ఉందన్నారు.
ప్రమాదాల్లో గాయపడితే...
దేశవ్యాప్తంగా ఏటా దాదాపు అయిదు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో సగటున 1.34 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా.. 5.27 లక్షల మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి వివిధ రకాల అవయవాలు దెబ్బతింటున్నాయి. వీరికి సకాలంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందిస్తే అవయవలోపాలు లేకుండా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీని కోసం ప్రత్యేక నిపుణులు అవసరమని ఎంసీఐకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. ఈ సూచన మేరకు పీజీలో 'ఎమర్జెన్సీ మెడిసిన్‌' అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
రాష్ట్రానికి 400 వైద్యసీట్లు ఖరారు
* 4 ప్రభుత్వ కళాశాలలకు 200 సీట్లు
* ఇటీవలే ప్రైవేటులో 200 మంజూరు
* గుంటూరు, వరంగల్‌కు అదనపు సీట్లపై త్వరలో నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రానికి ఎంబీబీయస్‌లో కొత్తగా 400 సీట్లు దక్కాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీలతో పాటు కాకినాడ, తిరుపతి కళాశాలలకు ఒక్కో చోట 50 అదనపు సీట్లను భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో 200 సీట్లు కొత్తగా వచ్చాయి. ప్రైవేటులో హైదరాబాద్‌లో కామినేని ఆస్పత్రికి 150 సీట్లతో కొత్త కళాశాల, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ప్రైవేటు కళాశాలకు 50 సీట్లు ఇటీవలే అనుమతించారు. దీంతో రాష్ట్రానికి అధికారికంగా 400 సీట్లు కొత్తగా సమకూరాయి. దీనికి సంబంధించి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందనుంది. గుంటూరు, వరంగల్‌లో అదనపు సీట్లకు సంబంధించిన అనుమతులపై ఎంసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీలైనంత త్వరలో వీటిపైనా అధికారిక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి 'ఈనాడు'తో చెప్పారు. ప్రైవేటులో కొత్తగా హైదరాబాద్‌లో ఒక మహిళా కళాశాల, ఓ మైనారిటీ కళాశాల భారతీయ వైద్యమండలి పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5500 వైద్యసీట్లకు అదనంగా 400 సీట్లు రావడంతో వీటి సంఖ్య 5900కు చేరాయి. మరో 200 నుంచి 350వరకు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
* ఎంబీబీయస్ రుసుములపై వారంలో నిర్ణయం
వైద్యకోర్సుల వార్షిక రుసుములను ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయించనుంది. నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగినందున యాజమాన్య కోటా కింద భర్తీ చేసే సీట్లకు రుసుములను పెంచాలని ప్రైవేటువైద్య కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే ఒక్కో సీటుకు ఏడాదికి రూ.2.40 లక్షలు, యాజమాన్య కోటాలోని సీటుకు రూ.5.50 లక్షలు రుసుములుగా విద్యార్థులు చెల్లిస్తున్నారు. వీటిని పెంచాలని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుత రుసుములపై 10 శాతంలోపు పెంపు ఉండేలా నిర్ణయం తీసుకోవాలని రుసుముల నియంత్రణ కమిటీకి తెలిపింది. దీనికి ప్రైవేటు వైద్యకళాశాలలు అంగీకరించడం లేదు. యాజమాన్య కోటా సీటుకు కనీసం రూ.10 లక్షలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఎంసెట్ ఫలితాలు కూడా వచ్చినందున రుసుములపై వారం రోజుల్లోగా నిర్ణయం వెలువడగలదని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఎన్నికల సంవత్సరం కనుక రుసుముల పెంపు పెద్దగా ఉండకపోవచ్చునని సమాచారం.
ఎంసెట్‌లో అబ్బాయిలదే పై చేయి!
* తొలి 20మంది ర్యాంకర్లలో ఇద్దరే అమ్మాయిలు
* జూన్ 17 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్!
హైదరాబాద్: 'ఎంసెట్-2013' ర్యాంకుల్లో అబ్బాయిలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో తొలి పది ర్యాంకర్లలో ఐదో ర్యాంకరు ఒక్కరే అమ్మాయి. మిగిలిన వారంతా అబ్బాయిలే. మెడిసిన్ విభాగంలోనూ తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదో ర్యాంకరు మినహా అంతా అబ్బాయిలే. గత ఏడాది ఒక్కో విభాగంలో ఇద్దరు అమ్మాయిలుండగా.. ఈ దఫా ఒక్కొక్కరే ఉండటం గమనార్హం. ఎంసెట్- 2013 ర్యాంకులను ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూన్ 5న సాయంత్రమిక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌ను ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. పారదర్శకంగా ఈ కోటా సీట్ల భర్తీ జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. యాజమాన్య కోటాలో భర్తీచేసే 30% సీట్ల వరుస క్రమానికి గత ఏడాది జారీచేసిన జీవోలో సవరణలు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఈ కోటాలో రాష్ట్ర జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలతో నిమిత్తం లేకుండా మార్చి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో ర్యాంకులను వెల్లడించడం ఇదే ప్రప్రథమం. సమయాభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
* కన్వీనర్ కోటా కింద సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశాల ప్రకటన జారీచేసే తేదీ విషయమై ఈనెల 10వతేదీ నాటికి ఒక అవగాహనకు వస్తామని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయప్రకాష్‌రావు తెలిపారు. న్‌లోనే తొలి విడత కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తామని వెల్లడించారు. జులైలో మలి విడత కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని ప్రకటించారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీపై ప్రవేశాల ప్రకటన జారీ చేసిన మరుసటి రోజే యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపట్టేందుకు వీలుగా అధికారిక ప్రవేశాల ప్రకటనను జారీ చేస్తామని తెలిపారు.
* ఎంసెట్ ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య విద్య ప్రశ్నాపత్రాల్లో ఎటువంటి తప్పులు లేవని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు వెల్లడించారు. సీడీ పాస్‌వర్డ్ కింద 'ఎర్రర్ ఫ్రీఎంసెట్‌'గా పేర్కొనడం గమనార్హం.
ఎంసెట్ ఇంజినీరింగ్ రాసిన వారు - 2,76,995
అర్హత సాధించిన వారు - 2,30,502(72.67%)
ఎంసెట్ వ్యవసాయ, వైద్య పరీక్ష రాసిన వారు - 99,983
అర్హత సాధించిన వారు - 89,311 (80.79%)
ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి...
మాక్ కౌన్సెలింగ్ కోసం క్లిక్ చేయండి...
ఎంసెట్‌.. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ టాప్‌ 10 ర్యాంకర్లు వీరే!
33,738 ఉద్యోగాలకు ఒకేసారి అనుమతి!
వేగంగా ఉద్యోగాల భర్తీకి సర్కాలు చర్యలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 33,738 ఉద్యోగాలకు అర్హులను నేరుగా ఎంపిక చేసేందుకు జూన్ 3న సర్కారు ఒకే సారి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల మండలి, జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు (డీఎస్‌సీ) వీటిని చేపడతాయి. అనుమతించినవాటిలో 34 శాఖల్లోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4తో పాటు ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్, సాంకేతిక వర్గీకరణల్లోని ఉద్యోగాలు ఉన్నాయి. నియమాక సంస్థలు ఆయా శాఖల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకొని వాటికి అనుగుణంగా చర్యలు చేపడతాయి.
రాష్ట్రంలోని 1.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిన సర్కారు ఇప్పటికి 52వేల ఉద్యోగాలకు మాత్రం అర్హులను ఎంపిక చేయగలిగింది. భర్తీకి శాఖల వారీగా ఉత్తర్వులు ఇచ్చే విధానాన్ని ఇంతవరకు అనుసరిస్తూ వచ్చింది. ఇటువంటి విధానంలోని నియామకాల ప్రక్రియ నత్తనడకలో ఉన్నందున ఇప్పుడు వివిధ శాఖలకు చెందిన 33,738 ఖాళీలను పొందుపరుస్తూ జూన్ 3న ఒకే సారి ఉత్తర్వు ఇచ్చింది. ఉత్తర్వులో పేర్కొన్న ఖాళీలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆయా శాఖల ప్రధానాధికారులంతా నియామకాల సంస్థలకు అందజేయాలి. ఇటువంటి వివరాల్లో జోన్, జిల్లా వారీ ఖాళీల పరిస్థితి, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు వంటివన్నీ ఉంటాయి. జిల్లా ఎంపికల కమిటీలు (డీఎస్‌సీ) ద్వారా నింపాల్సి ఉన్న పోస్టులకు సంబంధించి ఆయా పరిపాలన శాఖల కార్యదర్శులు, ప్రధానాధికారులు అందుకు అవసరమైన చర్యలు చేపడతారు. నియామాకాలకు ముందు దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది.
భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్య ఇదీ
* ఆర్థిక శాఖలో సీనియర్ అకౌంటెంట్లు 273
* లెక్టరర్లు 617
* జూనియర్ లెక్చరర్లు 4,523
* ఫిజికల్ డైరెక్టర్లు 325
* సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 575
* సాగునీటి శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 256
* ఎక్సైజ్ ఎస్ఐలు 314
* సాంఘీక సంక్షేమ శాఖలో వార్డర్లు 250
* ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లు 3,848
* ఏఆర్ కానిస్టేబుళ్లు 1,254
* సివిల్ కానిస్టేబుళ్లు 4,661
* కమ్యునికేషన్ల కానిస్టేబుళ్లు 748
* ఇంధన శాఖలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్లు 748
* వ్యవసాయ విస్తరణ అధికారులు 393
* ఎంపీహెచ్ఏ , ఏఎన్ఎం 2,234
* సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (డీఎస్‌సీ) 1,140
* ల్యాబ్ టెక్నేషియన్లు గ్రేడ్ టు 935
* ఫార్మాసిస్టులు గ్రేడ్ టు 894
* స్టాఫ్ నర్సు 580
నియామక సంస్థల వారీగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య
* ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 11,250
* పోలీస్ నియామకాల మండలి 11,623
జిల్లా ఎంపికల సంఘాలు (డీఎస్‌సీ) 10,865
మొత్తం 33,738

శాఖల వారీగా ఖాళీల కోసం క్లిక్ చేయండి
కొత్త ఉద్యోగాలు ఇవే...
* నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 34,450 ఉద్యోగాలను నిర్ణీత గడువులోగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం మే 24న ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 12,072 పోస్టులను ఏపీపీఎస్సీ, 7,346 పోస్టులను డీఎస్సీ, 14 ఉపాధి కల్పన కేంద్రాలు, 11,387 పోలీసు నియామక సంస్థ, 133 పోస్టులను యూనివర్శిటీల ద్వారా భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
* ఉపాధ్యాయులు (గిరిజన సంక్షేమం) - 1877
* ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు - 314
* ఎక్సైజ్ సూపరింటెండెంట్లు - 104
* డిప్యూటీ కలెక్టర్లు - 10
* ఫారెస్ట్ రేంజ్ అధికారులు - 59
* జూనియర్ లెక్చరర్లు - 4523
* సీనియర్ లెక్చరర్లు - 617
* సాంకేతిక విద్య లెక్చరర్లు - 180
* డీఎస్పీలు- 4
* వైద్యులు- 1140
* వైద్య విధాన పరిషత్ - 575
* ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు - 3848
* సివిల్ కానిస్టేబుళ్లు - 4661
* రిజర్వు కానిస్టేబుళ్లు - 1254
* డ్రైవర్లు- 24
* ప్రత్యేక రిజర్వు కానిస్టేబుళ్లు - 52
* ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్లు - 214
వీటికితోడు అదనంగా మరో 3,498 పోస్టులకు సంబంధించిన ప్రకటన త్వరలో జారీచేయనున్నారు.