‣ ఇంజినీరింగ్ ప్రవేశాల నిరీక్షణకు 20రోజులు..
‣ బోధన రుసుములు, కళాశాలల జాబితా విడుదలలో జాప్యం
ఈనాడు, అమరావతి: ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజులు గడిచినా ఇంతవరకు కళాశాలలు, బోధనా రుసుములను ఉన్నత విద్యాశాఖ ప్రకటించలేదు. దీంతో కళాశాలలు, సీట్ల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. నిబంధనల ప్రకారం రుసుములు, కళాశాలలు, సీట్ల సంఖ్య తేలాకే కౌన్సెలింగ్కు ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. ముందుగానే కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే రుసుములు, సీట్లను నిర్ణయించాలని అధికారులు భావించారు. వీటిల్లో జాప్యం జరగడంతో కౌన్సెలింగ్ ప్రహసనంగా మారింది. ఇంజినీరింగ్, బీఫార్మసీలో ప్రవేశాలు పొందేందుకు 85,702మంది విద్యార్థులు 20 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వీరు కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల కోసం నిరీక్షిస్తున్నారు. ఐచ్ఛికాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని విద్యార్థులు ఫోన్లు చేస్తున్నా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కరవైంది. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసినా రాష్ట్రంలో మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్పై స్పష్టత రావడం లేదు. డిసెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇప్పటికే ప్రకటించింది. ఈలోపు బోధనా రుసుములపై ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు అనుబంధ గుర్తింపున్న కళాశాలల సంఖ్యను ప్రకటించాల్సి ఉంది. సీట్ల కేటాయింపు పూర్తి చేయాలి. ఎంసెట్ కౌన్సెలింగ్కు అక్టోబరు 23న ప్రకటన ఇచ్చారు. మొదట 27 వరకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. ఈ గడువు పూర్తి కావడంతో నవంబరు 3వరకు పొడిగించారు. అప్పటికీ బోధన రుసుములు, కళాశాలల జాబితా సిద్ధం కాకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలన నిలిపివేశారు. సహాయ కేంద్రాలను మూసివేశారు. జేఎన్టీయూ కాకినాడ ఇంతవరకు అనుబంధ గుర్తింపు కళాశాలలు, సీట్ల వివరాలను కన్వీనర్కు అందించలేదు. రాష్ట్రంలో ఎక్కువ ఇంజినీరింగ్ కళాశాలలు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగానే ఉన్నాయి.
డిగ్రీపై మరింత ఉత్కంఠ..
ఈ ఏడాది నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ చేశారు. కళాశాలలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ మొదటిసారిగా బోధన రుసుములను ఖరారు చేసింది. వీటిని నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వాల్సి ఉండగా ఇంతవరకు విడుదల కాలేదు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తిచేసిన తర్వాత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్పై స్పష్టత లేనందున డిగ్రీ ఎప్పుడనేది తెలియని పరిస్థితి. దీంతో డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోను ఉత్కంఠ నెలకొంది.