‣ ఫిబ్రవరి 1 నుంచి మొదలుకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్: ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ తరగతులూ కొనసాగించవచ్చని పేర్కొంది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే విద్యార్థుల హాజరు విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో తెలిపింది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని.. ఈ ఏడాది పరీక్షల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ని తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది.
మరిన్ని మార్గదర్శకాలు..
‣ ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దు.
‣ ఒకటి నుంచి 8 వ తరగతి వరకు డిటెన్షన్ ఉండదు.
‣ పదో తరగతి పరీక్షలు షెడ్యూలు తర్వాత విడుదల చేస్తారు.
‣ జూనియర్ కళాశాలల్లో 300కి పైగా విద్యార్థులుంటే షిఫ్టు విధానం అమలు చేయాలి.
‣ 300లోపు విద్యార్థులున్న కళాశాలల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు నిర్వహించవచ్చు.
‣ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు నిర్వహించాలి.
‣ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలి.
‣ డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల్లో రొటేషన్ విధానంలో రోజుకు సగం మంది విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి.
‣ డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సుల్లో ఈ సెమిస్టర్ కనీస హాజరు తప్పనిసరి కాదు.