జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పిజీ డిప్లొమా, పలు సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి గడువు డిసెంబరు 17 వరకు పొడిగించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల్లో ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసినవారు, విశ్వవిద్యాలయం నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చన్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ రుసుం చెల్లించలేకపోయినా, డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేకపోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బీటెక్, బీఫార్మసీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ ఏంఏ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చరిత్ర, సోషియాలజీ, ఆంగ్లం, సైకాలజీ, జర్నలిజం కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 04023680333/555 లలో పొందవచ్చన్నారు.
అంబేడ్కర్ వర్సిటీ కోర్సుల ప్రవేశ గడువు పెంపు
Posted Date : 12-12-2020 .