‣ వెబినార్లో కేవీ విద్యార్థులతో కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్
దిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సూచించారు. జనవరి 18న ఆయన కేంద్రీయ విద్యాలయ (కేవీ) విద్యార్థులతో వెబినార్లో మాట్లాడారు. దేశంలో కరోనా భయం నెలకొన్న వేళ పరీక్ష కేంద్రాలకు వెళ్లడంపై ఓ విద్యార్థి ఆందోళన వ్యక్తంచేశాడు. దీనిపై ఆయన పరీక్షల చుట్టూ ఉన్న అంశాలపై భయపడాలి గానీ.. పరీక్షా కేంద్రాలకు వెళ్లడంపై ఆందోళనే అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతేడాది నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి వెళ్లడంపై ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. విద్యార్థులతో నూతన జాతీయ విద్యా విధానం -2020, పరీక్షలు, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
తగ్గించిన సిలబస్తోనే పరీక్షలు..
కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులను దశలవారీగా పునఃప్రారంభిస్తామన్నారు. సగం మంది విద్యార్థులు తరగతులకు హాజరైతే.. మిగతా సగం మందికి ఆన్లైన్లో తరగతులు ఉండేలా నిర్వహిస్తామన్నారు. సీబీఎస్ఈలో ఈ ఏడాది తగ్గించిన సిలబస్ ఆధారంగానే పోటీ పరీక్షలకు ప్రశ్నలు అడుగుతారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్ 2021, నీట్ 2021 పరీక్షలకు తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు. ఆయా పరీక్షలకు సవరించిన సిలబస్ ఆధారంగానే విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ భాగం నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని పోఖ్రియాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.