* కేటాయింపు సమయంలోనే భర్తీ కాని 41 సీట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని 14 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి సుమారు 300 బీటెక్ సీట్లు మిగిలిపోయాయి. వాటిల్లో మొత్తం 3,151 బీటెక్ సీట్లుండగా.. కౌన్సెలింగ్లో చివరి విడత కేటాయించినప్పుడే 41 సీట్లు భర్తీ కాలేదు. దానికితోడు సీట్లు వచ్చిన వారిలో పలువురు కళాశాలల్లో చేరలేదు. వారంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో చేరినట్లు చెబుతున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ ప్రాంగణంలోనే 106 సీట్లు, మంథనిలో 39, సుల్తాన్పూర్ కళాశాలలో 16 సీట్లు మిగిలాయి. ఓయూలో 320 సీట్లుంటే 257 మందే చేరారు. 63 ఖాళీగా ఉన్నాయి. ఇతర వర్సిటీల కళాశాలల్లో కలిపి ఇలా దాదాపు 300 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్కోటా సీట్లు మిగిలిపోతే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో స్పాట్ ఉండదు. మిగిలిపోయిన సీట్లు ఖాళీగా ఉంచాల్సిందే. సీట్లు మిగలకుండా మార్గాలు ఆలోచిస్తామని రెండు మూడేళ్ల నుంచి అధికారులు చెబుతున్నా ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు.