* నవంబరు 27 నుంచి డిసెంబరు 2 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు మూడు విడతలతో పాటు ఒకసారి ప్రత్యేక విడత ద్వారా విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయించారు. మొత్తం 1.90 లక్షల మంది డిగ్రీ కళాశాలల్లో చేరారు. తాజాగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఎంసెట్ బైపీసీ ద్వారా ఫార్మా సీట్లనూ కేటాయించారు. వాటితోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు దక్కనివారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత మార్చిలో ఇంటర్ పరీక్షలు రాయకున్నా ఉత్తీర్ణులైన 27 వేల మందిలో చాలా మంది డిగ్రీలో చేరే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా నవంబరు 27 నుంచి డిసెంబరు 2 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక కేటగిరీల వారి ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 2న ఆయా విశ్వవిద్యాలయాల్లోని సహాయ కేంద్రాల్లో ఉంటుందని పేర్కొన్నారు. సీట్లను డిసెంబరు 4న కేటాయిస్తామని చెప్పారు. ఇదే చివరి అవకాశమని, విద్యార్థులు కోర్సులు, కళాశాలలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకొనే విషయంలో అప్రమత్తంగా ఉండాలని లింబాద్రి కోరారు. సీట్లు పొందిన వారు డిసెంబరు 4 నుంచి 7లోపు ఆన్లైన్ రిపోర్ట్ చేసి సీటు కేటాయింపు పత్రం, ఇతర సర్టిఫికెట్లను కళాశాలల్లో సమర్పించాలని ఆయన సూచించారు.