* ఇస్రో అవగాహన కార్యక్రమాలు
* రాష్ట్రం నుంచి 5 పాఠశాలల ఎంపిక
సూళ్లూరుపేట, న్యూస్టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, వారికి అంతరిక్ష పరిజ్ఞానంతోపాటు, సైన్స్పై ఆసక్తి పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అవగాహనా కార్యక్రమాలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) పేరుతో ఇస్రో, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 100 పాఠశాలలను ఎంపిక చేశాయి. మొదటి విడత కింద 45 పాఠశాలల్లో కార్యక్రమాలను ఆన్లైన్లో ప్రారంభించారు. రాష్ట్రం నుంచి నెల్లూరు జిల్లాలోని సంగం బాలికల గురుకుల పాఠశాల, నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం, ప్రకాశం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం, కడపలోని ఏపీ మోడల్ స్కూలు, చిత్తూరు జిల్లా నారాయణవనంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శ్రీహరి కోటలోని షార్ కేంద్రం ఎంపిక చేసుకుంది. ‘ఆత్మ నిర్భర్’ కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరణలతోపాటు అంతరిక్షంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇస్రో ప్రధాన కార్యాలయం కెపాసిటీ బిల్డింగ్లోని అధికారుల సమన్వయంతో ఇస్రోలోని వివిధ కేంద్రాల శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు విద్యార్థులకు సలహాలిస్తారు. ప్రయోగాలను ప్రోత్సహించడంతోపాటు అంతరిక్ష కార్యకలాపాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులను శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి తీసుకొచ్చి, రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా 6-12వ తరగతి వరకు చదువుతున్న 30 లక్షల మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.