* నాలుగేళ్ల కాలానికి ఒకేసారి నిర్ణయం
ఈనాడు, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం-ఫార్మా, ఫార్మా-డీ, ఫార్మా-పీబీ కోర్సులకు 2019-2020, 2020-21 నుంచి 2022-23 వరకు బోధన రుసుములను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర జనవరి 18న నోటిఫికేషన్ జారీ చేశారు. గతేడాది బోధన రుసుములు నిర్ణయించకుండానే పీజీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో గతేడాదితోపాటు ప్రస్తుత, రానున్న మరో రెండేళ్లకు సైతం రుసుంలను ఖరారు చేశారు. నాలుగేళ్లకు సంబంధించి ఒకే ఫీజులను నిర్ణయించడం గమనార్హం. 2019-20కి నిర్ణయించిన వాటినే మరో మూడేళ్లకు పొడిగించారు. ట్యూషన్, అనుబంధ గుర్తింపు, మెడికల్, క్రీడలు, సాంస్కృతిక, కంప్యూటర్ తదితర ఫీజులన్నీ బోధన రుసుంలలోనే ఉంటాయని, విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా ఏమీ వసూలు చేయరాదని స్పష్టం చేశారు. 2019-20కి సంబంధించి 239 ఎంబీఏ, 113 ఎంసీఏ, 231 ఎంటెక్, 107 ఎం-ఫార్మాసీ, 59 ఫార్మా-డీ, 31 ఫార్మా-పీబీ కళాశాలలకు ఫీజులను నిర్ణయించారు.